Home »
» అంబేద్కర్ స్ఫూర్తితో ఎప్పుడూ పేదల పక్షానే..
అంబేద్కర్ స్ఫూర్తితో ఎప్పుడూ పేదల పక్షానే..
హైదరాబాద్: అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో వైఎస్సార్ కాంగ్రెస్ ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందని పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అన్నారు. ఆదివారం బాబాసాహెబ్ 122వ జయంతిని పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం ఏర్పాటైన వైఎస్సార్ కాంగ్రెస్ పేద ప్రజల కోసం పనిచేస్తుందని.. ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్పారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎనలేని పోరాటం చేశారని, ఆయన విధానాలనే వైఎస్ స్ఫూర్తిగా తీసుకుని.. ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, ఆవాస భద్రత వంటి కీలకమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారని తెలిపారు. పేదవారి కళ్లల్లో కన్నీళ్లు చూడకూడదనే మహాత్మాగాంధీ ఆలోచనను కూడా వైఎస్ స్ఫూర్తిగా తీసుకున్నారని చెప్పారు. ‘వైఎస్సార్ ఆశయాల సాధన కోసం ఆయన వారసత్వంతో ఆవిర్భవించిన పార్టీ కనుక నిరంతరం అణగారిన వర్గాల సంక్షేమాన్నే దృష్టిలో ఉంచుకుంటుంది. అంబేద్కర్ ఒక్క దళితులకే ఆదర్శం కాదు. సమానత్వం కోరుకునే వారందరికీ ఆయన నాయకుడు’ అని కొనియాడారు. చట్టసభల్లో దళితులకు రిజర్వేషన్లు సాధించిన గొప్పవ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. అలాంటి మహనీయుడి ఆశయాల సాధనకు కృషి చేయడమే.. ఆయనకు నిజమైన నివాళి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్, సీజీసీ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మారెప్ప, పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త పీఎన్వీ ప్రసాద్తోపాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొని, అంబేద్కర్కు నివాళులర్పించారు. అంతకుముందు విజయమ్మ ట్యాంక్ బండ్ వద్దకు పార్టీ నేతలతో కలిసి వెళ్లి.. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
|
|
0 comments:
Post a Comment